విశాఖపట్నం: కూర్మన్నపాలెం సమీపంలోని కణితి నిర్వాసిత రాజులపాలెంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కుక్క దాడి (Dog Attack) చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. తమ్మినేని వరహాలనాయుడు, అనురాధ దంపతులు రాజులపాలెం అల్లూరి సీతారామరాజు పార్కు ఎదురుగా నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు పవన్ సూర్య (4) సాయంత్రం వీధిలోని చిన్న పిల్లలతో ఆడుకుని ఒంటరిగా ఇంటికి వెళ్తుండగా కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. పవన్సూర్య గట్టిగా ఏడవడంతో అపార్ట్ మెంట్ మూడో అంతస్తులో ఉన్న తల్లి ఒక్కసారిగా కేకలు వేస్తూ కిందకు వచ్చారు.
అప్పటికే బాలుడి తల వెనుక భాగంపై తీవ్ర గాయం కాగా.. ముఖం, పొట్ట బాగాలపై స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అగనంపూడి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తీసుకెళ్లారు. తల వెనుక భాగంలో తీవ్రగాయం కావడంతో కుట్లు వేశారు. ప్రస్తుతం కేజీహెచ్ పిల్లల వార్డులో పవన్ సూర్యకు చికిత్స అందిస్తున్నారు.