ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది. చంద్రయాన్-3 ( chandrayaan-3) మిషన్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organization ) ఇస్రో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య ఎల్1 (Aditya L1).. మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రయోగాలు ప్రస్తుతం లైన్లో ఉన్నాయి.
సూర్యుడిపై అధ్యయనానికి తొలిసారిగా ఆదిత్య- ఎల్1:
సెప్టెంబరు 2న సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఆదిత్య- ఎల్1 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. పీఎస్ఎల్వీ-సీ57 ( PSLV C-53) వాహక నౌక ద్వారా శనివారం (సెప్టెంబరు 2న) ఆదిత్య-ఎల్1 ( Aditya L1) ఉపగ్రహాన్నిజియో ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. లాగ్రేంజియన్ పాయింట్-1(ఎల్-1) భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 109-177 రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించి 24 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం (September 1) ఉదయం 11.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 24 గంటల పాటు కొనసాగి.. శనివారం ( September 2) ఉదయం రెండో ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
తాజాగా ఈ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి కొద్దిసేపటి కిందటే కౌంట్డౌన్ ఆరంభమైనట్లు ఇస్రో ప్రకటించింది. లాంచింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లు పేర్కొంది. లాంచింగ్ రిహార్సల్స్ను ఇదివరకే ముగిశాయని, అన్నీ సజావుగా ఉన్నాయని వివరించింది. పీఎస్ఎల్వీ సీ57 పనితీరు, ఇతర యంత్ర సామాగ్రి, డేటా కనెక్షన్స్, కంట్రోల్ రూమ్తో లింకేజ్ వ్యవస్థ.. వంటి కీలక విభాగాలు సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా ఏడు పేలోడ్స్ను తన వెంట మోసుకెళ్తుంది పీఎస్ఎల్వీ శాటిలైట్. రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ కేటగిరీలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనోగ్రాఫ్, సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఉంటాయి. ఇన్-సైటు పేలోడ్స్ కేటగిరీలో హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్రే పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్యను ఈ శాటిలైట్ తీసుకెళ్తుంది.
ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్:
ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ గురువారం రాత్రి షార్కు చేరుకున్నారు. ప్రయోగం పూర్తయ్యే వరకూ మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ రానున్నారు. మరోవైపు, ఇస్రో ఏ ప్రయోగం చేపట్టిన తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని దర్శించుకుని.. విజయవంతం కావాలని శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని.. ఆదిత్య ఎల్1 నమూనాను ఆయన పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకున్నారు.
ఆదిత్య ఎల్1 పని తీరు:
కాగా, భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని సూర్యుడి హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని చేర్చనున్నారు. గ్రహణాల వంటి అడ్డంకులతో సంబంధం లేకుండా సూర్యుడ్ని నిరంతరం అధ్యయనం చేసేందుకు లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహం చేరి.. ఐదేళ్ల పాటు అక్కడ సమాచారాన్ని సేకరిస్తుంది. కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం జరుగుతుంది. సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు చేయనున్నారు. ఇందులో మొత్తం ఏడు పేలోడ్లను అమర్చారు. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేయనున్నాయి. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లను అధ్యయనం చేయనున్నాయి. లాంగ్రాజ్ పాయింట్ 1 ప్రదేశానికి ఉన్న సానుకూల పరిస్థితుల దృష్ట్యా ఈ నాలుగు పరికరాలు సూర్యుడ్ని స్వయంగా పరిశీలించనున్నాయి.