తెలంగాణా: ఖమ్మం (khammam) జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరులో విషాదం చోటుచేసుకుంది. కూసుమంచి మండలంలోని కోక్యా తండాకు చెందిన విద్యార్థి దుర్గానాగేందర్ (16) నవోదయ పాఠశాల (navodaya school)లో 12వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 3న పాఠశాలలో రీజినల్ స్పోర్ట్స్ మీట్ ఉంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ మీట్కు వచ్చే వారిని ఆహ్వానించేందుకుగాను పాఠశాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీ కోసం ఇనుప బోర్డు ఏర్పాటు చేస్తుండగా బోర్డు పైభాగంలో విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుదాఘాతంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ముగ్గురు కోలుకోగా.. దుర్గానాగేందర్ ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన జరిగిన వెంటనే పాఠశాల ప్రిన్సిపల్ పరారయ్యారు. విద్యార్థి మృతి (student death) చెందడంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో స్థానికులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.