విశాఖపట్నం: పీఎం పాలెంలో గల ఏసీఏ-వీడీసీఏ (ACA-VDCA) స్టేడియంలో ఆదివారం జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్ పాల్గొనే భారత్, ఆస్ర్టేలియా (Ind vs Aus) క్రికెటర్లు నేడు (శనివారం) నగరానికి చేరుకోనున్నారు. ముంబైలో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో (Ind vs Aus 1st Odi) పాల్గొన్న ఇరుజట్ల ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక బస్సులో రుషికొండలోని హోటల్ రాడిసన్ బ్లూకు చేరుకుంటారు. సాయంత్రం కొందరు ఆటగాళ్లు హోటల్లో విశ్రాంతి తీసుకోనుండగా, మరికొందరు పిచ్ను పరిశీలించడంతోపాటు ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం ఏసీఏ వీడీసీఏ స్టేడియం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా వారు బస చేసే హోటల్ వద్ద ఇప్పటికే ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు.