విశాఖ న్యూస్/Robbery in Auto: ఎక్కడికైనా వెళ్ళాలంటే తరచుగా ఆటో ఎక్కుతున్నారా..అయితే అప్రమత్తత తప్పనిసరి. ఆదమరిస్తే అంతే.. మీ జేబులు, బ్యాగ్లు మొత్తం ఖాళీ అవుతాయి జాగ్రత్త. ఆటో ఎక్కి ప్రయాణికుల ముసుగులో కొందరు కేటుగాళ్లు నగరంలో చోరీలు చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన విశాఖలోని పెందుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం దరి దుర్గానగర్కు చెందిన సత్యవతి అనే మహిళా గురువారం రాత్రి ఆటోలో నగరానికి బయలుదేరారు. వేపగుంట కూడలిలో ఇద్దరు గుర్తు తెలియని మహిళలు ఆటో ఎక్కి నాయుడుతోట కూడలి దగ్గర దిగిపోయారు. ఈ మధ్యలోనే సత్యవతి హ్యాండ్ బ్యాగ్ చోరీ అయ్యింది. బ్యాగులో సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని మహిళలు దోపిడీ చేసినట్లు గమనించిన ఆమె వెంటనే పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయగా.. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొందరు కేటుగాళ్లు ఆటోల్లో (Robbery in Auto) ప్రయాణికుల్లా నటించి చోరీలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.