దేశీయ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన రస్నా ( RASNA) బ్రాండ్ వ్యవస్థాపకుడు అరీజ్ పిరోజ్షా కంబట్టా (85) కన్నుమూశారు. ఐ లవ్ యూ రస్నా ప్రకటన ద్వారా ఈ బ్రాండ్ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కంపెనీ ఛైర్మన్గా ఉన్న అరీజ్ పిరోజ్ శనివారం తుదిశ్వాస విడిచారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. బెనోవోలెంట్ ట్రస్ట్, రస్నా ఫౌండేషన్ ఛైర్మన్గా, ప్రపంచ పార్సి ఇరానీ జొరాస్టిస్ మాజీ ఛైర్మన్గానూ ఆయన వ్యవహరించారు. దేశీయంగా రస్నా బ్రాండ్ అంటే తెలియని వారు ఉండరు. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ బ్రాండ్ను దాదాపు 60 దేశాల్లో ఇప్పుడు విక్రయిస్తున్నారు. ఎన్ని బహుళ జాతి కంపెనీలు వచ్చినప్పటికీ ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా రస్నా (RASNA) ఉంటూ వస్తోంది. సాఫ్ట్ డ్రింక్ ఖరీదుగా మారిన కాలంలో రస్నా ప్యాకెట్లను తీసుకొచ్చి కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు అరీజ్ పిరోజ్షా. కేవలం రూ.5 ప్యాకెట్తో 32 గ్లాసుల డ్రింక్ను తయారుచేసుకునేలా తీర్చిదిద్దారు.