Visakhapatnam: విశాఖలోని గీతం యూనివర్సిటీ (Gitam University) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో కొంత వరకు ప్రభుత్వ స్థలం ఉన్నట్లు గుర్తించామని తెలిపిన రెవెన్యూ అధికారులు.. ఆ స్తలంలో కంచె నిర్మాణం చేపడుతున్నారు. కంచె నిర్మాణ సామాగ్రితో పోలీసు బందోబస్తు మధ్య యూనివర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. మెయిన్ క్యాంపస్లోని డెంటల్ కళాశాల వద్ద కిలోమీటర్ మేర కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారణంగా వేకువజామున 2 గంటల నుంచే గీతం యూనివర్సిటీకి వెళ్లే అన్ని రోడ్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు రెండు కిలోమీటర్ల ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనివ్వలేదు. ఐడీ కార్డులు చూపిస్తేనే స్థానికులను ఆ మార్గంలో పంపిస్తున్నారు.
పోలీసుల ఆంక్షలతో చుట్టు పక్కల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ గీతం కళాశాలను (Gitam University) ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనపరుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పొలిసు బందోబస్తు నడుమ ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై గీతం యూనివర్సిటీ స్పందించాల్సి ఉంది.