ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ (Archery World Championship) లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. రెండు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల ఈవెంట్లో స్వర్ణం దక్కించుకోగా.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించారు. పురుషుల టీమ్ ఈవెంట్లో రిషభ్, ప్రథమేశ్, అమన్సైని బృందం ఫైనల్ (Archery World Championship Final) లో ఫ్రాన్స్పై విజయం సాధించింది. తెలుగు తేజం జ్యోతి – రిషభ్ జోడీ తుది పోరులో రెండు పాయింట్లతో స్వర్ణాన్ని కోల్పోయింది.
రిషభ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేశ్తో కూడిన భారత బృందం ఫైనల్లోనూ విజృంభించింది. ఫ్రాన్స్పై రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో 235-233తో ఫ్రాన్స్ను చిత్తు చేసిన టీమ్ఇండియా స్వర్ణాన్ని దక్కించుకుంది. జ్యోతితో కలిసి రజతం సొంతం చేసుకున్న రిషభ్.. పురుషుల టీమ్ ఈవెంట్లో మాత్రం ఏమాత్రం తడబాటుకు గురికాలేదు. మిగతా ఇద్దరితో కలిసి భారత్కు గోల్డ్ అందించాడు.
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో వెన్నం జ్యోతి సురేఖ జోడీకి రజతం దక్కింది. ఫైనల్లో నెదర్లాండ్స్ ద్వయం చేతిలో 157-155 తేడాతో జ్యోతి-రిషభ్ జోడీ ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో కేవలం రెండు పాయింట్ల తేడాతో స్వర్ణం చేజారింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది తొమ్మిదో పతకం. వ్యక్తిగత విభాగంలో ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గిన ఆమె ఖాతాలో నాలుగు టీమ్ పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం), రెండు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ రజతాలు ఉన్నాయి.