MLC Elections: విజేతగా ప్రకటించినా.. డిక్లరేషన్‌ ఇవ్వడంలో జాప్యం

admin
By admin 16 Views
2 Min Read

ఆంధ్రప్రదేశ్: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపొందారు. శనివారం రాత్రి 8 గంటలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినా, అర్ధరాత్రి 12 గంటల వరకూ ధ్రువీకరణపత్రం అందించకపోవడంతో ఆగ్రహించిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సంయుక్త కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ కారును అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసులు రంగప్రవేశం చేసి తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులను అరెస్టు చేసి, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసులే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే కాపాడేవారెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను అధికారులు ఉల్లఘించారని, దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్‌ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు.

West Rayalaseema MLC

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ:

ముఖ్యమంత్రి జగన్‌ (cm jagan), ఆయన కార్యాలయం ఒత్తిడితో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత, తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu naidu)ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి  లేఖ రాశారు. తెదేపా అభ్యర్థి గెలిచినట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించినా డిక్లరేషన్‌ ఇవ్వలేదని ఆ లేఖలో వివరించారు.

Share this Article
Leave a comment