ఆంధ్రప్రదేశ్: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరిట దాదాపు 53 ఇళ్లను ఇటీవలే అధికారులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) అండగా నిలబడ్డారు. బాధితులకు ఆయన రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వైకాపా ప్రభుత్వ దాష్టీకానికి ఇప్పటంలో ఇళ్లు దెబ్బతిన్నవారు.. ఆవాసాలు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున అందజేయాలని పవన్కల్యాణ్ నిర్ణయించారన్నారు. మార్చి 14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు గ్రామస్థులు సహకరించి సభాస్థలి ఇచ్చారు. అందుకే వారిపై కక్ష గట్టి పోలీసులను మోహరించి జేసీబీలతో ఇళ్లు కూల్చివేశారన్నారు. ఘటన జరిగిన మర్నాడే పవన్కల్యాణ్ ఇప్పటంలో బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రూ.లక్ష చొప్పున పవన్ ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే ఆయన స్వయంగా బాధితులకు అందజేస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.