TTD Gold: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయాల్లో ఒకటైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారికి ఎంత బంగారం ఉందో, ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? ప్రసాదాల తయారికి ఎంత నెయ్యి ఉపయోగిస్తున్నారు లాంటి విషయాలు మీకు తెలుసా..? తాజాగా తితిదే ఈవో ధర్మారెడ్డి తిరుమలకు సంబంధించిన పలు ఆసక్తికర సమాచారం వెల్లడించారు. వారణాశిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో పాల్గొన్న ఆయన.. తితిదే వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలు.. స్వామి వారికి ఎంత బంగారం ఉంది? ప్రసాదాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దేశవ్యాప్తంగా 71 ఆలయాలను నిర్వహిస్తోందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాలు ( Venkateswara Swamy Gold) 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుందని వివరించారు. తితిదేలో 24,500 మంది ఉద్యోగులు ఉండగా, ఆలయంలో భక్తులకు సేవలందించడానికి రోజుకి 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తామన్నారు. ఏడాదికి శ్రీవారికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. తితిదే పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉందని పేర్కొన్నారు. స్వామి పేరుతో రూ. 17వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ చేశామని వివరించారు. తితిదేలో వివిధ శాఖల సిబ్బంది ఎలా పనిచేస్తారు? వారి విధివిధానాల గురించి వివరించారు. అంతర్జాతీయ ఆలయాల సమావేశం, ఎగ్జిబిషన్లో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్భగవత్ శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) పై ప్రశంసలు కురిపించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా సేకరించిన నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో తితిదే ఆలయాలు నిర్మించడంపై అభినందించారు. ‘‘ చిన్న మధ్య స్థాయి ఆలయాలను గుర్తించి.. ఆ ఆలయ సంప్రదాయాలు, ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఆలయాల ద్వారా హిందూమతం విలువలు తెలియజేయాలి. మన సంస్కృతిని వివరించారు. ఆలయాల ద్వారా విద్య, వైద్య సేవలను ప్రజలకు అందించాలి. పేదవారి వైద్యానికి ఆలయాల నుంచి సహకారం అందించాలని మోహన్ భగవత్ కోరారు.