విశాఖపట్నం: పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన బొడ్డు పైడినాయుడు కుటుంబానికి మాజీ స్పీకర్, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు బీమా పరిహారం చెక్కును (Janasena insurance check) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల సంక్షేమముతో పాటు జనసైనికుల సంక్షేమానికి అనే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జన సైనికుల సంక్షేమం కోసం తమ సొంత నిధులతో కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తుందని అన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జనసైనికుడు తండ్రి బొడ్డు సూర్యుడుకు ఐదు లక్షల రూపాయల భీమా చెక్కు పరిహారాన్ని ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ పంచకర్ల సందీప్, జనసేన సీనియర్ నాయకులు తాతారావు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
కోటి విరాళం అందించిన పవన్:
పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా చేయించడానికి గత రెండు సంవత్సరాలుగా జాసేనాధినేత పవన్ కళ్యాణ్ ఏటా రూ.కోటి చొప్పున విరాళాన్ని అందజేస్తున్నారు. వరుసగా మూడో ఏడాది కూడా తనవంతుగా రూ.కోటి విరాళాన్ని ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ఎమన్నారంటే..?
కార్యకర్తలు జనసేన కోసం డబ్బు లేకుండా, ఏమీ ఆశించకుండా మనస్ఫూర్తిగా పని చేస్తున్నారన్నారు. అలాంటి కార్యకర్తల కుటుంబాలకు ఏమైనా చేయాలని ఆలోచించినప్పుడు రెండేళ్ల క్రితం క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించామని, క్లిష్ట పరిస్థితుల్లో కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లగలిగామని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వాన్ని బీమా పథకంగా కాకుండా ఒక కోర్ ఓటు బ్యాంకుగా భావించాలన్నారు.
జనసేన పార్టీ కేవలం 150 మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైందని. ఈ రోజు లక్షల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. గత ఏడాది ఆ సంఖ్య దాదాపు హాఫ్ మిలియన్ కి చేరడం ఆనందం కలిగించే విషయమన్నారు. బయట సభలు, సమావేశాలకు వెళ్తున్న సందర్భంలో ఉత్సాహంగా వచ్చే కార్యకర్తలు పలు సందర్భాల్లో ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలించుకోవడం చూసి.. రాజకీయ ప్రస్థానంలో అండగా ఉన్న వీరికి ఏమైనా చేయగలమా అని ఆలోచన వచ్చిందని, ఆ సమయంలో పార్టీ పెద్దలంతా ఆలోచన చేసి ఒక బీమా పథకం లాంటిది తీసుకురావాలని నిర్ణయించామన్నారు.
2020లో క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయన్నారు. అన్నింటినీ అధిగమించి దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన 100మందికి పైగా క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా పథకం కింద అందచేశామన్నారు. గాయపడిన 180 మందికి మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కులు అందచేశామన్నారు. ఇంటికి సరైన పైకప్పు కూడా లేని పరిస్థితుల్లో పార్టీ మీద నమ్మకంతో రూ. 500 సభ్యత్వం స్వీకరించి దురదృష్టకర పరిస్థితులు ఏర్పడినప్పుడు అలాంటి కుటుంబాలకు బీమా పథకం అండగా నిలచిందన్నారు.