Crime News: నోట్లో బల్లి (lizard) పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా (corba) జిల్లాలో జరిగింది. నాగిన్భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్కుమార్ సందేకు ముగ్గురు చిన్నారులు ఉండగా.. వీరిలో చిన్నవాడైన రెండున్నరేళ్ల జగదీశ్.. సోమవారం ఉదయం మంచంపై పడుకున్నాడు. అతడి తల్లి ఇంట్లో పనులు చేసుకుంటూ మధ్యలో వెళ్లి జగదీశ్ను చూసేసరికి.. అతడి నోట్లో బల్లి కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి.. రోదించడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. నోట్లో ఉన్న బల్లితో పాటు జగదీశ్ కూడా మృతిచెందాడు. అయితే బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదుని, బల్లి నోట్లో పడడం వల్ల శ్వాశ ఆడక చనిపోయే అవకాశం ఉందని జంతుశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే పేర్కొన్నారు. బాలుడి మరణానికి గల అసలు కారణం తెలియాలంటే పోస్టుమార్టం పరీక్షల ఫలితాలు వస్తేనే తెలుస్తుందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.